యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై సీపీఎం నేత గఫూర్ సంచలన వ్యాఖ్యలు.. దేశంలో ఎన్నో సమస్యలుంటే దీనిపై ఎందుకంత తొందర?
Big Debate: దేశంలో UCC అమలుపై కేంద్ర ప్రభుత్వం తీరును సీపీఎం నేత గఫూర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Big Debate: దేశంలో అమలు చేయతలపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అంశంపై కేంద్ర ప్రభుత్వం తీరును సీపీఎం నేత గఫూర్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో ఉపాధి కల్పన, నిరుద్యోగ సమస్య, ప్రజల మధ్య ఐక్యత వంటి ఎన్నో తీవ్రమైన సమస్యలున్నప్పటికీ, వాటిని విస్మరించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా UCC అమలుపై ఎందుకు అంత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడమే అజెండాగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు.
2016లో ఎన్డీయే ప్రభుత్వమే లా కమిషన్ను ఏర్పాటు చేసిందని, 2018లో జస్టిస్ బి.ఎస్. చౌహాన్ నేతృత్వంలోని అదే కమిషన్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి UCC అవసరం లేదని, వాంఛనీయం కాదని స్పష్టంగా తెలిపిందని గుర్తుచేశారు.
దేశం ఆర్థికాభివృద్ధిలో, ఉపాధి కల్పనలో వెనుకబడి ఉందని, ప్రభుత్వాలు ప్రజలను ఐక్యంగా ఉంచే ప్రధాన సమస్యలపై ఫోకస్ చేయాలని హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ది కోసం, వివాదాలు సృష్టించేందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్నప్పటికీ, వందల ఏళ్లుగా వస్తున్న ఆచార సంప్రదాయాలు, పర్సనల్ లా మార్పులపై బలవంతంగా చట్టాలు రుద్దడం సరికాదని, అన్ని వర్గాలతో ఓపికగా చర్చలు జరిపి ఐక్యతను పెంపొందించాలని డిమాండ్ చేశారు.




