BIG Debate: ఓట్ల కోసం కాదు.. దేశం కోసమే బిల్లులు: బీజేపీ నేత సుహాసిని!
BIG Debate: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లులపై బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుహాసిని ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అపోహలను తిప్పికొట్టారు.
BIG Debate: ఓట్ల కోసం కాదు.. దేశం కోసమే బిల్లులు: బీజేపీ నేత సుహాసిని!
BIG Debate: జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న కీలక బిల్లులపై రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో hmtv బిగ్ డిబేట్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ సుహాసిని ఆనంద్ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలు ఓట్ల కోసం కాదు, దేశ ప్రక్షాళన కోసమేనని ఆమె స్పష్టం చేశారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో చారిత్రాత్మక మార్పులు వచ్చాయని సుహాసిని ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బిల్లులు తెస్తోందన్న విపక్షాల ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉంటూ 'బేటీ బచావో బేటీ పఢావో', 'సుకన్య సమృద్ధి', 'లఖ్పతి దీదీ' వంటి ఎన్నో విప్లవాత్మక పథకాలను తీసుకువచ్చిందని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా పూర్తి చిత్తశుద్ధితోనే పార్లమెంట్ ముందుకు తెచ్చామని, ఎన్నో ఏళ్ల నాటి మహిళల కలను నిజం చేసే బాధ్యతగా దీనిని భావిస్తున్నామని పేర్కొన్నారు.




