Off The Record: శ్రీకాకుళం టీడీపీలో ఆధిపత్య పోరు!
Off The Record: శ్రీకాకుళం టీడీపీలో ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నగరపాలక సంస్థ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది.
Off The Record: శ్రీకాకుళం టీడీపీలో ఆధిపత్య పోరు!
Off The Record: శ్రీకాకుళం నగర టీడీపీ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయా..? అంటే అవును అనేది స్పష్టం అవుతోందట. టిడిపి అంటే గుండ ఫ్యామిలీ. అవినీతి మరక లేని రాజకీయాలు నెరిపిన వ్యక్తి దివంగత గుండ అప్పల సూర్యనారాయణ.
ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవికి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసిన ఆ పార్టీ పెద్దలు.. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గొండు శంకర్ను బరిలోకి దింపారు.
శంకర్కు కింజరాపు ఫ్యామిలీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అలా గెలుపొందిన శంకర్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో దశాబ్దాలుగా పాలకవర్గం లేని శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని ఎమ్మెల్యే శంకర్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట.
తనను నమ్ముకున్న అనుచరులకు పదవులు కట్టబెట్టాలన్న ప్రధాన ఉద్దేశంతోపాటు, ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చేందుకు ఆయన ఒకింత గట్టిగానే ప్రయత్నిస్తున్నారట 2024 అసెంబ్లీ ఎన్నికల్లో లో శంకర్కు టికెట్టు ఇచ్చిన వెంటనే టీడీపీలో తీవ్ర ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయట.
అయినా కొద్ది రోజులకే అవి సద్దుమణిగాయంటారు రాజకీయ పరిశీలకులు. గొండు శంకర్ ఎమ్మెల్యేగా గెలిచాక.. అప్పటికే పార్టీలో సీనియర్లుగా ఉన్న టీడీపీ శ్రేణులను ఒక్కొక్కరిగా బయటకు పంపించేశారట. ఇదంతా చేసింది ఎమ్మెల్యే శంకర్ అనుయాయులేనట.
పార్టీ అవిర్భావం నుంచీ జెండా మోస్తున్న తమను తొక్కేశారని ఆవేదన చెందడం అలా టీడీపీకి దూరమైనవారి వంతయ్యిందట. ఈ క్రమంలో వీరంతా ఎమ్మెల్యే టికెట్ కోల్పోయి ఇన్నాళ్లూ పార్టీకి దూరంగా ఉండి, మళ్లీ యాక్బివ్ మోడ్లోకి వచ్చి గుండా ఫ్యామీలీ పంచన చేరుతున్నారట.
ఇలా గుండ లక్ష్మీదేవి యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు రావడంతోనే పార్టీలో సీనియర్లంతా ఏకమవుతున్నారట. టీడీపీ ఆవిర్భావం నుంచీ కీలకంగా ఉన్న గుండ కుటుంబాన్ని కాదని గొండు శంకర్కు టికెట్ ఇవ్వడం నచ్చలేదని బహిరంగంగానే చెబుతున్నారట.
ఒకదశలో నగరంలో గుండ అప్పలసూర్యలనారాయణ విగ్రహావిష్కరణకు కూడా ఎమ్మెల్యే శంకర్ అభ్యంతరం చెప్పారట వాదన లేకపోలేదు. ఇదే ఇష్యూలో గొండు శంకర్ తీరుపై గుండ అనుచరులు రగిలిపోతున్నారట.
మరోవైపు 16వ ఆర్థిక సంఘం నిధులను సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. అయితే కార్పొరేషన్ తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడటం.. జిల్లా రాజకీయాల్లో హాట్ టాపికైంది. కార్పొరేషన్ ఎన్నికలతోపాటు మరో చర్చ కూడా రీసౌండ్ చేస్తోంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గుండ ఫ్యామిలీకి టికెట్టు వస్తుంది.
కానీ విభజన జరగకపోతే శ్రీకాకుళం నియోజకవర్గం సీటు ఎవరికి ఇస్తారన్న చర్చ కూడా జోరందుకుంది. కార్పోరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ పదవిని గుండ వారుసులకు కేటాయించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఎమ్మెల్యే పదవి యధాతథంగా ఉంటుందంటున్నారు. అయితే నారా లోకేష్ ఆశీస్సులు మెండుగా ఉన్న గుండ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాధాన్య దక్కనుందోనన్న ఉత్కంఠ రేపుతోంది.
నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని దాదాపూ నిర్ణయించిన టీడీపీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుండ లక్ష్మీదేవికి అమరావతి నుంచి పిలుపురావడం, చంద్రబాబు-లోకేష్లతో ఆమె భేటీ కావడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
దశాబ్దాలుగా పార్టీకి విధేయులుగా ఉన్న గుండ కుటుంబానికి న్యాయం చేయడం కాకుండా, నగరంలో కూటమి పట్టు సడలకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుభవాన్ని వినియోగించుకోవాలని అధినాయకత్వం భావిస్తోందట.
శ్రీకాకుళం కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత తొలి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆకాంక్ష సహజంగానే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న గుండ లక్ష్మీదేవికే తొలి మేయర్ పీఠం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.
కానీ యువతకే పెద్దపీట వేయాలంటే మాత్రం గుండ కొడుకు విశ్వనాధంకు అవకాశాలు ఉన్నాయి. ఇలా అవమానాలు, కష్టాలను భరించిన గుండ కుటుంబానికి ఈ పరిణామం తిరుగులేని రాజకీయ పునరాగమనంగా మారనుందనే టాక్ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.




