Off The Record: సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెనుకపడిందా!

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో సోషల్ మీడియా మేధోమథనం. ప్రభుత్వ పథకాల ప్రచారం, విపక్షాల డిజిటల్ దాడుల తిప్పికొట్టడమే లక్ష్యంగా పిఆర్‌ఓలు, టీమ్‌లకు ప్రత్యేక శిక్షణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2026 7:25 AM IST
Off The Record
X

Off The Record: సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెనుకపడిందా!

Off The Record: సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో సెల్ అందులో సోషల్ మీడియా హవా అంతాఇంతా కాదు. ఇదే కోవలోకి దాదాపూ అన్ని రాజకీయ పార్టీలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అవును ఈ సోషల్ మీడియా ఫీవర్ అన్ని పార్టీలకు పాకింది. అన్ని పార్టీలకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ప్రతి పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువతను, ఇతర వర్గాలను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తునే ఉన్నాయి. చేసిన అభివృద్దితోపాటు విమర్శలు, ప్రతివిమర్శలు కూడా ఇందులోనే చేస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. అనేక అప్‌డేట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునే ఉంటారు.

సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతలా ఉంది అంటే.. ఏకంగా ప్రభుత్వాలను సైతం మార్చే శక్తి ఉందంటే అతిశయోక్తి కాదేమో. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఈ సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషించిందని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. అలా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి యూత్ ఆకర్షితులయ్యారు. అదే సోషల్ మీడియా ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇపుడు పూర్తిస్థాయిలో వాడుకోలేపోతోందట. ముఖ్యమంత్రి మొదలు కిందిస్థాయి సామాన్య కార్యకర్త వరకు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను సైతం సరిగా చూపించుకోలేకపోతోందని ఏకంగా పీసీసీ ఛీఫ్ స్థాయి నాయకుడు అభిప్రాయపడుతున్నారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని ప్రవేశపెడితే.. బస్సు ప్రయాణంలో మహిళలు కొట్టుకునే విజువల్స్‌ను విపక్షాలు హైలెట్ చేస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు మదనపడిపోతున్నారట. అంటే.. మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రావాల్సిన ప్రచారం రావడం లేదట. కోట్లాది మంది మహిళలు అనునిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ప్రయోజనం పొందుతున్నా ఆ స్కీమ్ సక్సెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందన్న టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా విభాగాలు కాంగ్రెస్ వైఫల్యాలు, నెరవేరని హామీలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో డిజిటల్ ప్రచారాలు చేస్తున్నాయి. ఉదాహరణకు మూసీ ప్రాజెక్ట్ వివాదాలు, రుణమాఫీ సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ట్రోల్స్ చేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లు నరికేస్తున్నారు.. పర్యావరణం పాడవుతోంది అంటూ సోషల్ మీడియాలో ట్రలో అయిన అనేక వీడియోలకు.. కాంగ్రెస్ సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదన్న అభిప్రాయం లేకపోలేదు. ప్రతిపక్షాల ఈ దూకుడును వేగంగా, వ్యూహాత్మకంగా తిప్పికొట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ విఫలమవుతోందనే విమర్శలు రీసౌండ్ చేస్తున్నాయి.

ఇక ప్రధాన ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై సీరియస్‌గా దృష్టి సారిస్తోందట. సోషల్ మీడియాను వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని ఆ పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారట. ప్రతిపక్షాలకు కౌంటర్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా టీంకు అదనంగా మరికొంత మందిని మరిన్ని సోషల్ మీడియా ఛానల్స్‌ను హ్యాండోవర్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగ మేళాలు, ప్రజా పాలన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో డిజిటల్ మీడియా, పబ్లిసిటీ విభాగాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయట. దీంతో.. సోషల్ మీడియా ప్రచారంలో కాస్త వెనుకపడ్డామని, చేసిన అభివృద్ధి పనులు సైతం చెప్పుకోలేకపోతున్నామని ఓ బడా నాయకుడు మీడియా సాక్షిగా తన మనసులో మాట చెప్పుకొచ్చారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేల పీఆర్వోలతోపాటు కాంగ్రెస్ పార్టీ పరిధిలోకి వచ్చే సోషల్ మీడియా టీంకు కూడా ప్రతి నెలలో ఒకరోజు ఈ అంశాలపై ప్రత్యేక క్లాసులు ఇప్పిస్తున్నారట. సోషల్ మీడియాను వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ. మరోవైపు నేతలు నేరుగా సోషల్ మీడియాకు కనెక్ట్ కావొద్దు అనే సూచనలు వచ్చాయట. ఎందుకంటే కావాలనే దుష్ప్రచారం చేయడడం వల్ల కొంత డిప్రెషన్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని మంత్రులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త కమిటీతో 100 సీట్లు సాధించడమే లక్ష్యంగా సోషల్ మీడియాను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందట. అయితే క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్, బిజెపిలు చేస్తున్న డిజిటల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంకా పూర్తిగా పుంజుకోవాల్సి ఉందంటున్నారు టెక్నోక్రాట్స్. మరి.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విషయంలో ఎంత దూకుడుగా వెళుతుందో చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్