Burning Topic: పాకిస్తాన్ సంచలన నిర్ణయం..చక్రం తిప్పిన భారత్
Burning Topic: పాకిస్తాన్లోని చారిత్రక నగరం లాహోర్లో ముస్లిం పేర్లను తొలగించి, మళ్లీ పాత హిందూ కాలం నాటి పేర్లను పునరుద్ధరిస్తూ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Burning Topic: పాకిస్తాన్ సంచలన నిర్ణయం..చక్రం తిప్పిన భారత్
Burning Topic: జిన్నే లాహోర్ నహీ వేఖ్యా.. ఓ జామ్యా హీ నహ.. అంటే లాహోర్ను చూడనివాడు నిజంగా పుట్టనట్టే.. పాకిస్థాన్లోని నానుడి ఇది. ఆ దేశంలోని చారిత్రిక నగరమే లాహోర్. ప్రస్తుతంలో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్ర రాజధాని ఇది.. ఇటీవలి కాలంలో లాహోర్ నగరం ప్రపంచ వార్తల్లోకి వచ్చేసింది. కారణం.. ఈ మహానగరంలోని ప్రాంతాలకు, రోడ్లకు పేర్లు మార్చేస్తున్నారుఇప్పటివరకు ఇస్లాంపూరాగా పిలిచిన ప్రాంతం కృష్ణ నగర్గా మారిపోయింది. సున్నత్ నగర్ను సంత్ నగర్గా, ముస్తఫాబాద్ను ధరమ్పురాగా మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బాబ్రీ మసీద్ చౌక్ తిరిగి తన పాత పేరైన జైన్ మందిర్ చౌక్గా మారింది. అంతే కాదు మౌలానా జఫర్ చౌక్ పేరు తిరిగి లక్ష్మీ చౌక్గా, సర్ ఆగ ఖాన్ చౌక్ పేరు తిరిగి డేవిస్ రోడ్గా, అల్లామా ఇక్బాల్ రోడ్ పేరు తిరిగి జైల్ రోడ్గా, ఫాతిమా జిన్నా రోడ్ పేరు తిరిగి క్వీన్స్ రోడ్గా, బాగ్-ఎ-జిన్నా పేరును తిరిగి లారెన్స్ రోడ్గా మారుస్తున్నారు..
ఇంతకీ ఈ ప్రాంతాలు, రోడ్ల పేర్లను ఎందుకు మారుస్తున్నారు? లాహోర్ నగరానికి ఉన్న బహుళ మతాల, సంస్కృతుల మిశ్రమ గుర్తింపును గౌరవించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలోని తొమ్మిది ప్రధాన ప్రాంతాలలో పాత పేర్లతో కూడిన కొత్త సైన్బోర్డులు వెలిశాయి. వాస్తవానికి మార్చామని చెబుతున్న పేర్లు పాతవే.. దేశ విభజన తర్వాత కొత్త పేర్లు పెట్టారు. ఇప్పుడు మళ్లీ పాత పేర్లను పునరుద్దరిస్తున్నారు.. అధికారిక రికార్డుల్లో పేర్లు మారినప్పటికీ, లాహోర్ స్థానిక ప్రజల గుండెల్లో, నిత్య జీవితంలో ఈ పాత పేర్లు ఎన్నడూ చెరిగిపోలేదు. అక్కడి ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇప్పటికీ లక్ష్మీ చౌక్, డేవోస్ రోడ్, క్వీన్స్ రోడ్ వంటి పాత పేర్లనే వాడుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్లును పునరుద్దరించే చారిత్రక నిర్ణయానికి ఆమోదం లభించింది.
లాహోర్ నగరంలో ఒకప్పుడు అఖండ భారత దేశంలోని భాగమే.. దేశ విభజనతో పాకిస్థాన్కు దక్కింది. పంజాబ్ రెండు ముక్కలు అయింది. తూర్పు పంజాబ్ భారత్లో ఉండిపోగా, పశ్చిమ పంజాబ్ పాకిస్థాన్లో భాగమైంది. దీని రాజధానే లాహోర్ నగరం. భారత్లో ఉన్న అమృత్సర్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్, దశాబ్దాల తర్వాత ఇప్పుడు తన మూలాలకు తిరిగి వస్తోంది. భారత్-పాక్ విభజన జరిగి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్న వేళ ఈ చారిత్రిక నగరం తన పూర్వ వైభవాన్ని, బహుళ సంస్కృతిని తిరిగి చాటుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ విభజనకు ముందు ఉన్న హిందూ, సిక్కు, జైన్, బ్రిటీష్ పాత పేర్లను అధికారికంగా పునరుద్ధరిస్తోంది పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం. కేవలం రెండు నెలల్లోనే తొమ్మిది ప్రదేశాల పేర్లను అధికారికంగా వాటి అసలైన పురాతన పేర్లతో పునరుద్దరించారు.
మహారాజా రంజిత్ సింగ్ సామ్రాజ్యానికి సంబంధించిన సిక్కు కట్టడాలు, పాత చర్చిలు, చారిత్రక క్రికెట్ మైదానాలు, మింటో పార్క్, పాత కుస్తీ అఖారాలను కూడా పునరుద్ధరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీ గేట్తో సహా లాహోర్ కోట నగరంలోని ఎనిమిది గేట్లు కూడా పునరుద్దరిస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ ఉన్న కాలంలో మార్చిన పేర్లను కూడా ఇప్పుడు పునరుద్దరిస్తున్నారు. ప్రస్తుత పంజాబ్ సీఎం మరియం నవాజ్ స్వయంగా ఆయన కుమార్తె.. లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్ ప్రాజెక్ట్పై చర్చించడానికి నవాజ్ షరీఫ్, మరియం నవాజ్ ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో లాహోర్లోని అనేక ప్రదేశాలకు వాటి పాత హిందూ-యుగం లేదా బ్రిటిష్-యుగం పేర్లను తిరిగి పెట్టాలని నిర్ణయించారు. లాహోర్ పాత పేర్లు మన చరిత్రలో భాగం. వాటిని పరిరక్షించాలి, చెరిపివేయకూడదు అన్నారు నవాజ్. చరిత్రకారులు, సామాజిక వేత్తలు దీనిని ఆహ్వానిస్తుంటే మత ఛాందసవాదులు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్థాన్ మతతత్వ విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి మైనారిటీలైన హిందువులపై హింస, అత్యాచారాలు, బలవంతంపు మత మార్పిడుల కారణంగా చాలా చెడ్డ పేరు వచ్చింది. 1947లో దేశ విభజనకు ముందు ఇక్కడ హిందువుల జనాభా సుమారు 14% నుండి 20% మధ్య ఉండేది. 2023 పాకిస్థాన్ జనగణన నివేదికల ప్రకారంహిందువుల శాతం 1.61% నుండి 2.17% కి పడిపోయింది.. పాకిస్థాన్ పాలకుల విధానాల కారణంగా ఆ దేశం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అప్పుల కోసం ఏ దేశానికి వెళ్లినా, మైనారిటీలపై వివక్ష గురుంచి ప్రశ్నిస్తున్నారు.. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు ఇప్పుడు క్లీన్ ఇమేజీ అవరసమైంది. అందుకే పాత పేర్లను పునరుద్దరించి బహుళ మతాల, సంస్కృతుల మిశ్రమ గుర్తింపు కోసం ఆ దేశ పాలకులు తాపత్రయపడుతున్నారు.. పేరు మార్చే ప్రక్రియ యొక్క రెండవ దశలో, పాకిస్థాలోని సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులలో కూడా అసలు పేర్లను పునరుద్ధరించవచ్చని వర్గాలు చెబుతున్నాయి.




