DGP Harish Kumar Gupta: టెక్నాలజీతో అగ్నిమాపక సేవలు.. డీజీపీ హరీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
DGP Harish Kumar Gupta: విజయవాడలో అగ్నిమాపక వారోత్సవాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు.
DGP Harish Kumar Gupta: టెక్నాలజీతో అగ్నిమాపక సేవలు.. డీజీపీ హరీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
DGP Harish Kumar Gupta: ప్రజలను అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ గవర్నర్పేటలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నాడు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
కార్యక్రమం ప్రారంభంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫైర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం అగ్నిప్రమాదాల నివారణపై రూపొందించిన కరపత్రాలు, గోడ పత్రికలు మరియు 5కే రన్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖలో వస్తున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే స్థాయి నుంచి, ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేసే స్థాయికి ఏపీ అగ్నిమాపక శాఖ ఎదిగిందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో అగ్నిమాపక భద్రతలో డేటా మరియు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తాయని, టెక్నాలజీ ఆధారంగా సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక, పోలీస్, విపత్తు నిర్వహణ మరియు ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నేటి నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కాలంలో వివిధ రకాల ప్రదర్శనలు, అవగాహన సదస్సుల ద్వారా అగ్నిప్రమాదాల నివారణ పద్ధతులను ప్రజలకు వివరించనున్నారు.




