Vijayawada: లోక్‌భవన్‌లో ఘనంగా గుజరాత్, మహారాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Vijayawada: విజయవాడ లోక్‌భవన్‌లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 May 2026 5:35 PM IST
Vijayawada
X

Vijayawada: లోక్‌భవన్‌లో ఘనంగా గుజరాత్, మహారాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Vijayawada: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని లోక్‌భవన్‌లో గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ‘గుజరాత్ గౌరవ్ దివస్’గా జరుపుకుంటారని తెలిపారు. గుజరాత్ చరిత్ర వేదకాలం నాటిదని, సోమనాథ ఆలయం, గిర్నార్ వంటి చారిత్రక ప్రదేశాలు రాష్ట్ర ప్రాచీనతకు నిదర్శనాలని అన్నారు. గుజరాత్ కేవలం సాంస్కృతికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా శక్తివంతమైన రాష్ట్రంగా ఎదిగిందని, వస్త్ర, వ్యవసాయ, సముద్ర వాణిజ్య రంగాల్లో 1960 నుంచి విశేష అభివృద్ధి సాధించిందని వివరించారు. రాష్ట్రంలోని ఓడరేవులు దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్య కేంద్రాలుగా నిలిచాయని తెలిపారు.

అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రం దేశంలో మూడవ అతిపెద్ద రాష్ట్రంగా, జనాభాలో రెండవ స్థానంలో నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ముంబై దేశ ఆర్థిక రాజధానిగా, చలనచిత్ర మరియు టెలివిజన్ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నదని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 15 శాతం వాటా కలిగి మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.

ఈ కార్యక్రమం ప్రారంభంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ మరియు మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వీడియో సందేశాలు అందించారు. అనంతరం కుమారి వైష్ణవి జానపద గీతాలు ఆలపించగా, గుజరాతీ సమాజ్ సభ్యులు గర్బా నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి పి.ఎస్. సూర్య ప్రకాష్, లోక్‌భవన్ అధికారులు, సిబ్బంది, అలాగే విజయవాడ, పరిసర ప్రాంతాల్లో చదువుతున్న గుజరాత్, మహారాష్ట్ర విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story