Anakapalli: రూ.లక్షల నిధులతో సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు ప్రారంభం: ఎమ్మెల్యే!
Anakapalli: అనకాపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.
Anakapalli: రూ.లక్షల నిధులతో సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు ప్రారంభం: ఎమ్మెల్యే!
అనకాపల్లి: అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పూర్తయిన, చేపట్టనున్న అభివృద్ధి పనులకు అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కొండుపాలెం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన కల్వర్టును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం చేనుల అగ్రహారంలో రూ.14.75 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు, చింతనిప్పుల అగ్రహారంలో రూ.11 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
చింతనిప్పుల అగ్రహారంలో సర్వ శిక్ష అభియాన్ నిధులతో రూ.11 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అలాగే MGNREGS పథకం కింద రూ.45 లక్షలతో చింతనిప్పుల అగ్రహారం నుంచి చేనుల అగ్రహారం వరకు నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని కూడా ప్రారంభించారు.
శంకరం గ్రామంలో గ్రామీణ నీటిపారుదల, పారిశుద్ధ్య శాఖల నిధులతో రూ.18.40 లక్షలతో చేపట్టిన సీసీ కాలువల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి టీడీపీ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుతో పాటు అనకాపల్లి మండలంలోని వివిధ గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




