Visakhapatnam: శివాజీ పార్కులో ‘స్వచ్ఛ ఆంధ్ర’ ప్రతిజ్ఞ
Visakhapatnam: స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ధ్యేయంగా "ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ" లక్ష్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
Visakhapatnam: శివాజీ పార్కులో ‘స్వచ్ఛ ఆంధ్ర’ ప్రతిజ్ఞ
Visakhapatnam: స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర ధ్యేయంగా "ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ" లక్ష్యానికి కృషి చేద్దామని, ప్లాస్టిక్ రహిత నగరంగా పర్యావరణహిత విశాఖను దేశంలోనే పచ్చదనంతో స్వచ్ఛమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు విశాఖ ప్రజలు చేయి చేయి కలపాలని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ ఎం.అభిషిక్త్ కిషోర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన "ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్" నేపథ్యంగా ఈస్ట్ జోన్ శివాజీ పార్కులో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి.రామిరెడ్డి, జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్, జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ లతో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర ధ్యేయంగా "ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్" గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ "ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్" నేపధ్యాన్ని సూచించిందని, అదే స్ఫూర్తితో విశాఖ నగరాన్ని"ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ"గా, ప్లాస్టిక్ రహిత నగరంగా పర్యావరణహిత విశాఖగా దేశంలోనే పచ్చదనంతో స్వచ్ఛమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 లో ప్రథమ స్థానంలో విశాఖను నిలిపేందుకు ప్రజలు చేయి చేయి కలిపి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ దేశాలు సైతం విశాఖలో పరిశ్రమలు నెలకొల్పేందుకు మంచి పరిశుభ్ర నగరంగా విశాఖను సూచిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ప్రాధాన్యంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని, ఆ దిశగా 1500 కోట్ల రూపాయలు తో పలు అభివృద్ధి కార్యక్రమాలను నగరంలో చేపడుతున్నామన్నారు. విశాఖను మరింత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మరింత భారంగా ఉందని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవకుండా, నీటిలో కరగకుండా, తినే ఆహారంలో చొచ్చుకుపోయి క్యాన్సర్ కారకంగా మారుతూ జలజీవులకు,
మూగజీవాలకు, మానవులకు ప్రాణహానిగా, మానవ జీవన మనుగడకు మరింత భారంగా తయారవుతున్నాయన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నియంత్రిస్తూ పూర్తిగా వాటికి స్వస్తి పలకాలని, రానున్న రోజుల్లో దేశంలోనే ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా నిషేధించడం జరుగుతుందని ఆ దిశగా కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు. విశాఖపట్నం ప్రజలు ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలుకుతూ, పరిశుభ్రమైన పర్యావరణహిత నగరానికి సహకరించాలని, నిత్యం ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రోడ్లపై,
బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా నాలుగు డస్ట్ బిన్ లలో విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. నగర ప్రజలు పరిశుభ్రతకు, పచ్చదనానికి, స్వచ్ఛతకు, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ విశాఖను పరిశుభ్రనగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కి సహకరించాలన్నారు. ఈరోజు "నేషనల్ డెంగ్యూ డే" ను గుర్తు చేస్తూ మలేరియా డెంగ్యూ వ్యాధులను నివారించేందుకు, దోమల వృద్దిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో నిత్య పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి.రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ ఆవిర్భావానికి ప్రజలందరూ సహకరించాలని, ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తిపరకాలని, కలెక్టర్ వారి సూచనలు ఆదర్శంగా తీసుకొని విశాఖను మరింత పరిశుభ్రంగా, సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల ముందుకు రావాలన్నారు.
అనంతరం అదనపు కమిషనర్ పి.నల్లనయ్య మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, ఒక క్యాన్సర్ కారకంగా మారి మానవులకు, జల, మూగజీవాలకు ప్రాణ హానిగా తయారవుతుందని, ప్లాస్టిక్ వస్తువులు విడనాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అందరితో కలసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, "సే నో టు ప్లాస్టిక్- బ్రింగ్ యువర్ ఓన్ బాగ్" అనే నినాదంతో అవగాహనపరమైన పోస్టర్ ను ఆవిష్కరించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించి సత్కరించారు. దోమలను నియంత్రించేందుకు, ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలికేందుకు ఏర్పాటుచేసిన అవగాహనపరమైన స్టాళ్లను సందర్శించి నిర్వాహకులను అభినందించి పలు సూచనలు చేశారు. "వేస్ట్ టు వండర్" నేపద్యంగా పనికిరాని ఇనుప వస్తువులతో నగరంలో గల స్క్రాబ్ వస్తువుల నిర్వాహకులు సృష్టించిన అద్భుతమైన కళాకృతుల ప్రదర్శనను తిలకించి ఆ కళాకారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ నాగార్జునరావు, డిడిహెచ్ ఇంచార్జ్ వాసుకి, సహాయక వైద్యాధికారి బి.ప్రసాద్ రావు, శానిటరీ సూపర్వైజర్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎస్ హెచ్ జి మెంబర్లు, ఆర్పీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




