Anakapalli: రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌పై చర్యలు తీసుకోవాలి

Anakapalli: అనకాపల్లిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సిద్ధార్థ సోషల్ సర్వీస్ అసోసియేషన్ డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 19 Sept 2026 9:46 PM IST
Anakapalli
X

Anakapalli: రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌పై చర్యలు తీసుకోవాలి

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా, పట్టణ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వివిధ రకాల నేరాలు, అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ సిద్దార్ధ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు వినతిపత్రం అందజేశారు.

అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో కొత్తూరు పోలీస్ డీఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జ్ పోలీస్ డీఎస్పీ శ్రీ ఇ. శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేసేందుకు కార్యాలయ ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ కే. సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా బల్లా నాగభూషణం మాట్లాడుతూ.. గ్రేటర్ విశాఖ జీవీఎంసీలో విలీనమైన అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడి కొన్నేళ్లు గడిచిందన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పట్టణ పరిధిలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు.

దీంతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని, తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా వివిధ రకాల నేరాలను నియంత్రించి ప్రజలకు భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, నేరాల అరికట్టేందుకు తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అనకాపల్లి రీజియన్ ఆర్టీఓ, జీవీఎంసీ కమిషనర్, స్థానిక జోనల్ కమిషనర్, జిల్లా పోలీస్ అధికారులను కోరినట్లు బల్లా నాగభూషణం తెలిపారు.

ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సిద్దార్ధ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి రొబ్బి మల్లేశ్వరరావు, సభ్యులు అయ్యగారు వెంకటరమణమూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహామూర్తి, జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బుగిడి నూకప్పారావు, అనకాపల్లి పట్టణ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు కాపరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI