Nakkapalli: బోయపాడు తీరంలో వేలాది చేపల మృతి.. స్పందించిన డిప్యూటీ సీఎం
Nakkapalli: పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం బోయపాడు సముద్రతీరంలో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందడం కలకలం రేపింది.
Nakkapalli: బోయపాడు తీరంలో వేలాది చేపల మృతి.. స్పందించిన డిప్యూటీ సీఎం
నక్కపల్లి: నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం బోయపాడు తీర ప్రాంతంలో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. చేపల మృతికి గల అసలు కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీకి సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేశారు. నీటి నమూనాలు, మృతి చెందిన చేపల శాంపిల్స్ ఇప్పటికే సేకరించి పరీక్షల కోసం పంపించారు.
కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ సీఎంఎఫ్ఆర్ఐతో పాటు ప్రముఖ శాస్త్రీయ సంస్థల నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ అధికారులు, మెరైన్ సైంటిస్టులు సంయుక్తంగా శాస్త్రీయ పరిశోధనలు చేపట్టి మూల కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు.
సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కాపాడటం, మత్స్యకారుల జీవనోపాధులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. బోయపాడు తీర పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, శాస్త్రీయ నివేదికలు అందిన వెంటనే తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
మరి బోయపాడు తీరంలో చేపల మృతికి అసలు కారణం ఏమిటి? శాస్త్రీయ నివేదికల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి? ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గేడ్డం బుజ్జి బోయపాడు సముద్రతీరంలో మృత్యువాత పడ్డ చేపలను పరిశీలించారు అధికారులు మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలని కోరారు.




