Rajole: నానమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు.. భావోద్వేగ ఘటన
Rajole: తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నానమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు రేణుక ఘటన స్థానికులను భావోద్వేగానికి గురిచేసింది.
Rajole
Rajole: రాజోలు మండలం రాజోలు గ్రామంలోని సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతంలో నివశిస్తున్న గాలిదేవర సత్యవేణి (75) మృతదేహానికి అవివాహితరాలైన మనవరాలు గాలిదేవర రేణుక తలకొరివి పెట్టిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
కిడ్నీల సమస్యలతో బాధపడుతు సత్యవేణి ఈరోజు ఉదయం మృతి చెందడంతో మనవరాలు రేణుక తలకొరివి పెట్టిన సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు సత్యవేణి - పురుషోత్తమరావు దంపతులకు శ్రీనివాస రావు ఒక్కడే కుమారుడు. శ్రీనివాస్ కి ఇద్దరు కుమార్తెలు...వీరిలో పెద్ద కుమార్తె వివాహితురాలై వేరే చోట భర్త పిల్లలుతో స్థిరపడింది.చిన్న కుమార్తె కు ఇంకా వివాహం కాలేదు.
తన తండ్రి శ్రీనివాస్ 2021 లో కరోనా తో మరణించారని, తన తండ్రిని కనీసం చివరి చూపు కూడా చూసుకోలేని నిస్సహాయ స్థితిలో తన తండ్రి దహన సంస్కారాలు జరిగాయని,తన తండ్రి లేకపోవడంతో తన నానమ్మ కు తలకొరివి పెట్టడం తన పితృ ఋణం తీర్చుకున్న భావన కలిగిందని రేణుక కన్నీటి పర్యంతం అయింది. ఇలా స్మశానానికి వెళ్ళి తన నానమ్మ కు తలకొరివి పెట్టడాన్ని చూసిన అందరు కన్నీరు పెట్టుకున్నారు.




