Bhogapuram Airport: కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు.. ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Bhogapuram Airport: "కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు!".. భోగాపురం ఎయిర్పోర్ట్ సభలో ప్రధాని మోదీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం.
Bhogapuram Airport: "140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ప్రధానికి ఇలాంటి అవమానాలు ఎదురుకావడం బాధాకరం. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి!" అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు.
"తెలుగుజాతి ఎవరికీ తలవంచదని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గర్జించారు. ఆ పవిత్ర భూమిలో ఏర్పాటైన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయం. సీఎం నారా చంద్రబాబు నాయుడి సమర్థ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో అగ్రగామిగా మారుతోంది." అని పవన్ కల్యాణ్ అన్నారు.
దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే ప్రాణవాయువు అని గ్రహించిన ప్రధాని మోదీ, విశాఖ రైల్వే జోన్తో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ మంజూరు చేసి ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చారని కొనియాడారు. దిల్లీ జంతర్మంతర్ వద్ద ప్రధానిపై చేసిన విమర్శలు తనను ఎంతో బాధించాయని, అయినా దేశాన్ని 'వికసిత్ భారత్' వైపు నడిపించే క్రమంలో మోదీ ఎక్కడా వెనకడుగు వేయలేదని చెప్పారు.
"తనను తీవ్రంగా దూషించే వారిని కూడా క్షమించే గొప్ప గుణం మోదీ గారిది. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం కష్టపడుతున్న ఇలాంటి ప్రధాని దొరకడం మనందరి అదృష్టం" అని పవన్ స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




