Rambilli: చిన్న కలవలపల్లిలో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే!

Rambilli: రాంబిల్లి మండలం చిన్న కలవలపల్లిలో రూ.20.20 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 1:17 PM IST
Rambilli
X

Rambilli: చిన్న కలవలపల్లిలో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే!

Rambilli: రాంబిల్లి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని కుళాయి ద్వారా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం మామిడివాడ పంచాయతీ పరిధిలోని చిన్న కలవలపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ (JJM) నిధులతో నిర్మించిన నూతన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.

రూ.20.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించడంతో పాటు ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభించనుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, రక్షిత మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించి, ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు రక్షిత మంచినీటి సరఫరా ఎంతో కీలకమని పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఎలమంచిలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI