Anakapalli: సబ్బవరం-షీలానగర్ హైవే పనులు శరవేగం!

Anakapalli: కూటమి ప్రభుత్వ చొరవతో రూ.963 కోట్లతో సబ్బవరం నుంచి షీలానగర్ వరకు ఆరు లైన్ల యాక్సిస్ కంట్రోల్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 30 Aug 2026 11:09 AM IST
Anakapalli
X

Anakapalli: సబ్బవరం-షీలానగర్ హైవే పనులు శరవేగం!

Anakapalli: సబ్బవరం- షీలానగర్ ఆరు లైన్ల యాక్సిస్ కంట్రోల్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు పది నెలల క్రితం ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణం ప్రస్తుతం చకచకా సాగుతోంది. అండర్ పాత్వేలు, కల్వర్టులు, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పొలాల్లో ఉన్న సాగునీటి వనరుల వద్ద కూడా కల్వర్టులు నిర్మిస్తున్నారు.

అమృతపురం శివారు సూరెడ్డిపాలెం వద్ద సుమారు 60 ఎకరాల్లో డబుల్ ఇంటర్ చేంజ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. అనకాపల్లి- ఆనందపురం రోడ్డు నుంచి వచ్చే వాహనాలు, రాయపూర్- విశాఖ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో వచ్చే వాహనాలు సూరెడ్డిపాలెం వద్ద విశాఖ పోర్టుకు వెళ్లేందుకు డబుల్ ఇంటర్ చేంజ్ నిర్మిస్తున్నారు.

వైసీపీ పాలనలో పడకేసిన పనులు

ఆనందపురం రహదారి విస్తరణతో పాటు సబ్బవరం- షీలానగర్ రోడ్డు నిర్మాణానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం రూ.500 కోట్లు మంజూరు చేసింది. అయితే అప్పట్లో సాంకేతికపరమైన కారణాలతో ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరగ్గా, అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రహదారిని నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో కేటాయించిన రూ.500 కోట్లు మురిగిపోయాయి. దీంతో పనులు అటకెక్కాయి. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో ఈ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. సబ్బవరం నుంచి అమృతపురం, కోటనరవ మీదుగా షీలానగర్కు 12.66 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో రోడ్డును విస్తరించేందుకు కేంద్రం నుంచి రూ.963.93 కోట్లు మంజూరఅయ్యేలా చర్యలు తీసుకుంది.

ఈ రహదారి అందుబాటులోకి వస్తే...

ఈ రహదారి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే విశాఖ నగరం మీదుగా భారీ వాహనాల రాకపోకలు తగ్గుతాయి. అలాగే విశాఖ పోర్టుకు గాజువాక మీదుగా వచ్చే భారీ వాహనాలు తగ్గుతాయి. అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు విశాఖ- రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో విశాఖ వచ్చీపోయే వాహనాలు కూడా సబ్బవరం మండలం అమృతపురం శివారు సూరెడ్డిపాలెం వద్ద ఏర్పాటవుతున్న డబుల్ ఇంటర్ చేంజ్ కనెక్టవిటీ వద్ద డైవర్షన్ తీసుకుని షీలానగర్ మార్గంలోకి వెళ్లిపోతాయి. అక్కడ నుంచి విమానాశ్రయం పక్కనున్న మార్గంలో పోర్టుకు వెళతాయి. దీని వలన విశాఖ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయి.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story