Visakhapatnam: తెలుగు శక్తి సదస్సుతోనే రైల్వే జోన్ సాకారం?
Visakhapatnam: విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాధనలో తెలుగు శక్తి కృషి మరువలేనిదని బి.వి.రామ్ వెల్లడి.
Visakhapatnam: తెలుగు శక్తి సదస్సుతోనే రైల్వే జోన్ సాకారం?
Visakhapatnam: ప్రత్యేక రైల్వే జోన్ విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత తమకే చెందుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. ఇదే అంశమై బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం విశాఖ కేంద్రంగా తెలుగు శక్తి నిర్వహించిన మేధోమధనం సమ్మేళనం సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ విశ్రాంత అధికారి ఏ.బీ.వెంకటేశ్వరరావు పాలకుల తీరును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం దివంగత ఎన్టీ రామారావు ప్రజలను దేవుళ్ళుగా భావించే వారని.. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు తమకు తామే దేవుళ్ళుగా భావించుకుంటూ ప్రజలను భక్తులుగా మార్చుకుంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. పాలకుల తీరును ఏ.బీ.వెంకటేశ్వరరావు ఘాటుగా విమర్శించిన కొన్ని రోజుల వ్యవధిలోనే రైల్వే జోన్ కల సాకారం అయిందన్నారు. అంటే అప్పటివరకు తమకు ఎందుకులే అని వ్యవహరించిన రాజకీయ నాయకులు.. ఉరుకులు పరుగుల మీద విశాఖ రైల్వే జోన్ గెజిట్ విడుదల చేయించారన్నారు.
గడచిన రెండు సంవత్సరాలుగా లేని ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పటికిప్పుడే విడుదల కావడం అంటే అది తెలుగు శక్తి మేధోమధనం సమ్మేళనం ప్రభావమేనని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అయితే రైల్వే జోన్ ను తామే సాధించామనే భ్రమలో ఉన్న రాజకీయ శ్రేణులు సంబరాలు చేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
చేతనైతే ప్రైవేటీకరణ అంచులో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించాలన్నారు. అప్పుడు సంబరాలు చేసుకుంటే సబబుగా ఉంటుందని బి.వి.రామ్ వ్యాఖ్యానించారు. ఏదేమనప్పటికీ విశాఖపట్నం తో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెలుగు శక్తి ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.




