Lakshimpeta: లక్షింపేట కేసు జడ్జి బదిలీ చేయాలని విదసం డిమాండ్
Lakshimpeta: లక్షింపేట మారణకాండ కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జిని బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని విదసం నేతలు డిమాండ్ చేశారు.
Lakshimpeta
Lakshimpeta: లక్షింపేట మారణకాండ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరుమలరావును బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విదసం ఆధ్వర్యంలో విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ 2012 జూన్ 12న లక్షింపేటలో జరిగిన మారణకాండలో ఐదుగురు దళితులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. దళిత సంఘాల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లక్షింపేటలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.
ప్రాసిక్యూషన్ అభ్యర్థనలు, బాధితుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా డిఫెన్స్కు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లుగా ఈ కేసుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ లేరని, బాధితులు సూచించిన న్యాయవాదిని ప్రభుత్వం నియమించలేదన్నారు. ఇదే సమయంలో కోర్టు తరఫున న్యాయవాదిని నియమించి విచారణ కొనసాగించడం అనుమానాలకు దారితీస్తోందని పేర్కొన్నారు.
గ్రామంలో 144 సెక్షన్ విధించి మీడియాను అనుమతించకుండా విచారణ కొనసాగించడం సహజ న్యాయ ప్రక్రియకు విరుద్ధమని అన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయమూర్తిపై బాధితులకు నమ్మకం కోల్పోయారని, వెంటనే ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ ప్రసాద్, యడ్ల గోపి, గోడి వెంకటేశ్వరరావు, గుడాల ఈశ్వరరావు, పి.భాస్కరరావు, బి.ఉమామహేశ్వరి, చక్కా రాంబాబు, నావేటి గురుదేవి తదితరులు పాల్గొన్నారు.




