Visakhapatnam: 10వ వార్డు నుంచి పోటీకి సిద్ధం - టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి కూటమి అభ్యర్థిగా అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్రీనివాస్ తెలిపారు.
Visakhapatnam: 10వ వార్డు నుంచి పోటీకి సిద్ధం - టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
విశాఖపట్నం: రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన 10వ వార్డు నుంచి కూటమి అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ తెలిపారు.
అవకాశం లభిస్తే పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల మద్దతుతో మంచి మెజార్టీ సాధించి పార్టీ విజయానికి నాంది పలుకుతానని ధీమా వ్యక్తం చేశారు.టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ గ్రామశాఖ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, పంచాయతీ బోర్డు సభ్యుడు సహా వివిధ బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు.
జిల్లా కమిటీలో 18 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశానని, ఆరేళ్లుగా వార్డు అధ్యక్షుడిగా సేవలందించానన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా, మాడుగుల నియోజకవర్గ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.‘30 ఏళ్లుగా పీఎం పాలెం, హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాల ప్రజలతో నాకు సన్నిహిత అనుబంధం ఉంది.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నా. అయితే వ్యక్తిగత ఆకాంక్ష కంటే పార్టీ నిర్ణయమే నాకు ముఖ్యం. అధిష్ఠానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా వారి విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా. కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యం’ అని దాసరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.




