Vizag: స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి.. వైసిపి
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో రూ. కోటి పరిహారం ఇవ్వాలని వైసిపి నేత ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు.
Vizag: స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి.. వైసిపి
Vizag: విశాఖపట్నం ఎల్జి పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టం పరిహారం జగన్మోహన్ రెడ్డి అందజేసినట్టు స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులకు రూ. కోటి చంద్రబాబు ప్రకటించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు.
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తగిన ప్రధాన్యత ఇచ్చారన్నారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ కార్మిక సంఘాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఎల్జి పాలిమర్స్ ఘటనలో కంపెనీ ప్రతినిధులను తమ వైసిపి ప్రభుత్వం జైలుకు పంపిందని, ఎం ఎన్ సి కంపెనీ ప్రతినిధులను జైలుకు పంపిన చరిత్ర తమదని గుర్తు చేశారు.
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదన్నారు. హోం మంత్రి పనితీరు రాజ్యాంగ బద్ధంగా లేదని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ నేతలను కాల్చిన ఘనత చంద్రబాబుదన్నారు. కార్పొరేట్ వర్గాలకు రూ. 99 పైసలకే భూములు కట్టబెట్టడం సంపద సృష్టా అని అడిగారు. మీడియా సమక్షంలో హోం మంత్రి అనిత చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ప్రజలకు చేసిన మంచిపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో హోమ్ మంత్రి అనితకు ఇకపై ధీటుగా బదులిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పనిచేసే తమకు ప్రభుత్వం బెదిరిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. వైఎస్. జగన్ ఆలోచనా విధానమే రాష్ట్ర అభివృద్ధికి శరణ్యం అని, ప్రజలు వైసిపి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు.




