Visakhapatnam: విశాఖలో 'వాకింగ్ టాక్స్'పై వైయస్సార్సీపీ ఫైర్!

Visakhapatnam: విశాఖలో నడకపై 'వాకింగ్ టాక్స్' విధించడం దారుణమని వైయస్సార్సీపీ నేత కొండా రాజీవ్ గాంధీ ఆగ్రహం.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 23 April 2026 3:31 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో 'వాకింగ్ టాక్స్'పై వైయస్సార్సీపీ ఫైర్!

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన అత్యంత వింత పోకడలకు పోతోందని, విశాఖలో వాకింగ్ చేసే పౌరులపై పన్ను విధించడం అత్యంత చెత్త విధానమని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం వాకింగ్‌ను ప్రోత్సహిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.720 పన్ను విధిస్తూ ప్రజల నడకపై ఉక్కుపాదం మోపుతోందని ధ్వజమెత్తారు. గత రెండేళ్లలో విశాఖకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయని కూటమి ప్రభుత్వం, వైయస్ జగన్ హయాంలో నిర్మించిన పార్కులు, స్టేడియాలపై పన్నులు వసూలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్‌కు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టిన ప్రభుత్వం, సగటు పౌరుడు పార్కులోకి వెళ్తే మాత్రం పన్ను అడగడం వారి అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తక్షణమే ఈ 'వాకింగ్ టాక్స్' నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని, సామాన్యుడి శ్వాసపై కూడా పన్ను వేసేలా ఉన్న ఈ ప్రభుత్వానికి ప్రజలే సమాధి కడతారని ఆయన హెచ్చరించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

నడకపై పన్ను - అత్యంత చెత్త విధానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన వింత పోకడలకు పోతోందని, విశాఖపట్నంలో వాకింగ్ చేసే వారిపై పన్ను విధించడం అత్యంత దారుణం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం వాకింగ్‌ను ప్రోత్సహిస్తూ రాయితీలు ఇస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం రూ.720 పన్ను విధిస్తూ "వాకింగ్ టాక్స్" అనే చెత్త విధానానికి తెరతీసింది. రేపు బాతింగ్ (స్నానం), బ్రీతింగ్ (శ్వాస) మీద కూడా పన్నులు వేస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారు.

అభివృద్ధి శూన్యం - దోపిడీ అపారం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా విశాఖలో కనీసం ఒక ప్రాజెక్టో, ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు పన్నులు విధిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్కు వంటివి వైయస్ జగన్ హయాంలో అభివృద్ధి చేసినవే. వైయ్. జగన్ చేసిన పనులకు చంద్రబాబు ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం సిగ్గుచేటు. లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌కు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టిన ప్రభుత్వం, సామాన్య పౌరుడు పార్కులోకి వెళ్తే మాత్రం పన్ను వసూలు చేయడం దారుణం.

విశాఖ నిధుల తరలింపు..

విశాఖపట్నం వాసులు జీవీఎంసీ కి కట్టిన పన్ను నిధులను కూడా చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి తరలిస్తోందని సమాచారం. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. గతంలో 'ఆపరేషన్ లంగ్స్' పేరుతో చిరువ్యాపారుల పొట్టకొట్టిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు వాకింగ్ టాక్స్ పేరుతో మధ్యతరగతి ప్రజలను వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో తక్షణమే విశాఖలో వాకింగ్ పన్నును రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు కూటమి నేతలను రాజీవ్ హెచ్చరించారు. వెంటనే ఈ చెత్త నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, విశాఖ పౌరులను ఏకం చేసి కూటమి ప్రభుత్వం దిగివచ్చే వరకు న్యాయపోరాటం మరియు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. సామాన్యుడి నడకపై పన్ను వేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో సమాధి కట్టడం ఖాయమని కొండా రాజీవ్ గాంధీ హెచ్చరించారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story