Parvathipuram: ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి: కలెక్టర్
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని శతశాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి
Parvathipuram: ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి: కలెక్టర్
పార్వతీపురం : జిల్లావ్యాప్తంగా నేడు జరగనున్న జాతీయ పల్స్ పోలియో నూతన ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శత శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు శనివారం ఆయన వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పల్స్ పోలియో ఏర్పాట్లపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు ఎవరూ వదలకుండా పోలియో చుక్కలు వేయించడమే మన లక్ష్యం కావాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా జూన్ 28న బూత్లలో పోలియో చుక్కలు వేయాలని, మిగిలిపోయిన వారికి జూన్ 29, 30 తేదీలలో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయాలని దిశానిర్దేశం చేశారు.
విద్యాశాఖ సిబ్బంది సహకారంతో 0-5 ఏళ్ల పిల్లలను గుర్తించి బూత్లకు వచ్చేలా సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బూత్ మరియు గృహ సందర్శన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని ఐసీడీఎస్ పీడీకి సూచించారు.
పాఠశాలలను పోలియో బూత్ల ఏర్పాటుకు సిద్ధం చేయాలని, టీచర్లు విధుల్లో భాగస్వామ్యం కావాలన్నారు.
పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాలలోని చాటింపుల ద్వారా ప్రచారం నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీచేశారు.
ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో సంచార (ట్రాన్సిట్) బూత్లను ఏర్పాటు చేసి ప్రయాణంలో ఉన్న పిల్లలకు చుక్కలు వేయాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు (రోటరీ, లయన్స్ క్లబ్) కూడా ఈ బూత్ సిబ్బందికి తమ వంతు సహకారం అందించాలన్నారు.
తల్లితండ్రులకు విజ్ఞప్తి
జిల్లాలోని 0-5 ఏళ్లలోపు వయసు గల పిల్లలందరూ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ప్రయాణాల్లో ఉన్నప్పటికీ సంచార బూతుల ద్వారా పోలియో చుక్కలు వేయవచ్చని, తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి పోలియో రహిత సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.




