Kurupam: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో ఎక్సైజ్ ఉక్కుపాదం!
Kurupam: నవోదయం 2.0లో భాగంగా కురుపాం సరిహద్దు రెంగల్పాడులో ఏపీ, ఒడిశా ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు. 620 లీటర్ల నాటు సారా, వెయ్యి కిలోల అమ్మోనియా స్వాధీనం.
Kurupam: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో ఎక్సైజ్ ఉక్కుపాదం!
Kurupam: నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. సహదేవ్ ఆధ్వర్యంలో శనివారం ఒడిశా ఎక్సైజ్, పోలీసు అధికారుల సహకారంతో రెంగల్పాడు గ్రామంలో సంయుక్త దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో నాటు సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 6,500 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అలాగే బట్టీలలో తయారు చేసి డ్రమ్లలో నిల్వ ఉంచిన 620 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. నాటు సారా తయారీకి వినియోగించేందుకు సిద్ధంగా ఉంచిన 1,000 కిలోల అమ్మోనియా, 600 కిలోల నల్లబెల్లం, 300 కిలోల ఇప్పపువ్వును స్వాధీనం చేసుకుని అధికారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సంయుక్త దాడుల్లో పార్వతీపురం టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వీవీఎస్ శేఖర్బాబు సిబ్బంది, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం.వి. గోపాలకృష్ణ సిబ్బంది, రాయగడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాలక బిషి, రాయగడ మొబైల్ ఇన్స్పెక్టర్ కెపీ సింధూర్, శేష్కల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ దమెశ్వర్ మహేజీ, కురుపాం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఒడిశా పోలీసు, ఎక్సైజ్ శాఖల సహకారంతో ఇటువంటి సంయుక్త దాడులు మరింత విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు.




