Palakonda: ‘ఏరువాక’ సంబరాలు.. నాగలి పట్టిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ!
Palakonda: మన్యం జిల్లా వీరఘట్టం మండలం ఎం. రాజాపురంలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొని సాగు పనులను ప్రారంభించారు.
Palakonda: ‘ఏరువాక’ సంబరాలు.. నాగలి పట్టిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ!
Palakonda: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఏరువాక పౌర్ణమి” కార్యక్రమంలో భాగంగా, ఈరోజు వీరఘట్టం మండలం ఎం. రాజాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు రైతులతో కలిసి పొలంలో దిగి సంప్రదాయ పద్ధతిలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతే రాష్ట్రానికి వెన్నెముక అనే భావనతో వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడం, సాగునీటి సౌకర్యాల మెరుగుదల, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం, రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
అలాగే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రైతుల ఆదాయం పెరిగేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
రైతు కుటుంబాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరికీ మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




