Parvathipuram: మన్యం జిల్లాకు రెడ్ అలర్ట్.. 54 డిగ్రీలకు చేరనున్న ఎండలు
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు 41°C నుండి 54°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు.
Parvathipuram: మన్యం జిల్లాకు రెడ్ అలర్ట్.. 54 డిగ్రీలకు చేరనున్న ఎండలు
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వారు జారీ చేసిన వాతావరణ హెచ్చరికల నివేదికను పరిశీలించిన అనంతరం ఆయన జిల్లా యంత్రాంగాన్ని మరియు ప్రజలను అప్రమత్తం చేశారు. రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి 41°C నుంచి 54°C వరకు చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి,పాలకొండ 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని కలెక్టర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు, వడదెబ్బ తగలకుండా తగినన్ని నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం వంటివి తీసుకోవాలని కోరారు.
మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సదుపాయాలు మరియు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు.




