Gummalakshmipuram: ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ నిలిచిపోయి టార్చ్లైట్ వెలుగులో చికిత్స
Gummalakshmipuram: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టార్చ్లైట్ వెలుగులో చికిత్స అందించారు.
Gummalakshmipuram: ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ నిలిచిపోయి టార్చ్లైట్ వెలుగులో చికిత్స
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వైద్య సిబ్బంది టార్చ్లైట్ వెలుగులోనే చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చెప్పగూడ గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడి తీవ్రంగా కాలిపోయాడు. కుటుంబ సభ్యులు బాలుడిని అత్యవసర చికిత్స కోసం భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్య సిబ్బంది టార్చ్ వెలుగులోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాలుడిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల ప్రారంభమైన నూతన ఆస్పత్రిలో ఇంకా పూర్తిస్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. డ్రైనేజీ, బాత్రూంలు, తాగునీటి సదుపాయాలతో పాటు విద్యుత్ అంతరాయ సమయంలో ఉపయోగించే జనరేటర్ సౌకర్యం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే జనరేటర్ ఏర్పాటు చేసి, ఆస్పత్రిలో మిగిలిన పనులను పూర్తి చేసి అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




