Vizianagaram: సీతంలో విద్యార్థులకు ‘క్యాంపస్ టు కెరీర్’ దిశానిర్దేశం!

Vizianagaram: విజయనగరం సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘క్యాంపస్ టు కెరీర్’పై లైఫ్ కోచ్ ఉదయ్ కుమార్ అలజంగి దిశానిర్దేశం చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 9 Sept 2026 7:03 AM IST
Vizianagaram
X

Vizianagaram: సీతంలో విద్యార్థులకు ‘క్యాంపస్ టు కెరీర్’ దిశానిర్దేశం!

Vizianagaram: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సీతంలో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా రెండో రోజు ‘క్యాంపస్ టు కెరీర్’ అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ లైఫ్ కోచ్, హెచ్‌ఆర్‌డి ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, రచయిత శ్రీ ఉదయ్ కుమార్ అలజంగి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. కళాశాల దశ నుంచే విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను క్రమంగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

రెండు దశాబ్దాలకు పైగా శిక్షణా రంగంలో అనుభవం కలిగిన శ్రీ ఉదయ్ కుమార్ అలజంగి ఇప్పటివరకు 500కు పైగా వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించడంతో పాటు 2,000కు పైగా మోటివేషనల్ ప్రసంగాలు అందించారని తెలిపారు.

విద్యార్థులు కేవలం డిగ్రీ సాధించడానికే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్, ఆలోచనా విధానం, సమస్య పరిష్కారం, వ్యక్తులతో సమర్థవంతంగా మెలగడం వంటి బహుముఖ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

ప్రతిరోజూ కనీసం ఒక గంటను స్వీయ అభివృద్ధికి కేటాయించాలని చెబుతూ, 20 నిమిషాలు ఇంగ్లిష్ అభ్యాసానికి, 20 నిమిషాలు సాంకేతిక అంశాల అభ్యాసానికి, మరో 20 నిమిషాలు పఠనం, ఏఐ లేదా సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధికి కేటాయించుకోవాలని సూచించారు.

క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావడం, శ్రద్ధగా వినడం, ప్రతిరోజూ కొత్త విషయాన్ని నేర్చుకోవడం, కమ్యూనికేషన్‌ను నిరంతరం సాధన చేయడం వంటి అలవాట్లు విద్యార్థుల భవిష్యత్ ప్రగతికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.

“నా ఇంగ్లిష్ బలహీనంగా ఉంది” అనే భావనకు బదులుగా “నేను ప్రతిరోజూ నా ఇంగ్లిష్‌ను మెరుగుపరుచుకుంటున్నాను” అని ఆలోచించాలని, ఇతరులతో పోల్చుకోవడం కంటే “నిన్నటికంటే ఈరోజు నేను మెరుగ్గా ఉండాలి” అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

లక్ష్యంపై స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిరంతర అభ్యాసం, క్రమశిక్షణతో కూడిన సాధన ఉంటే ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రంగంలో మంచి కెరీర్‌ను నిర్మించుకోగలడని ఆయన స్ఫూర్తినిచ్చారు. సెషన్ అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యను కేవలం పరీక్షలు, మార్కులకు పరిమితం కాకుండా కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను సమాంతరంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా తెలుసుకున్నామని తెలిపారు.

ముఖ్యంగా రోజువారీ స్వీయ అభివృద్ధికి సమయం కేటాయించడం, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం వంటి సూచనలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశి భూషణ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, అధ్యాపకులు, ప్రథమ సంవత్సరం విద్యార్థులు శ్రీ ఉదయ్ కుమార్ అలజంగిని ఘనంగా సత్కరించారు.

విద్యార్థులతో ప్రత్యక్షంగా, ఆసక్తికరంగా నిర్వహించిన ఈ ఇంటరాక్టివ్ సెషన్ వారిలో ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం, స్వీయ అభివృద్ధిపై అవగాహన, కెరీర్‌పై స్పష్టత పెంపొందించేందుకు దోహదపడింది.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story