Vizianagaram: విజయనగరం సత్య కళాశాలలో పర్యావరణహిత మట్టి వినాయకుల పంపిణీ

Vizianagaram: విజయనగరంలోని సత్య డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విద్యార్థులు, ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 12 Sept 2026 5:46 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం సత్య కళాశాలలో పర్యావరణహిత మట్టి వినాయకుల పంపిణీ

విజయనగరం: పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ మరియు పర్యావరణహిత వినాయక చవితి వేడుకలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సత్య డిగ్రీ & పీజీ కళాశాలలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల సంచాలకులు డా. ఎం. శశిభూషణ రావు మరియు ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సాయిదేవమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డా. ఎం. శశిభూషణ రావు మాట్లాడుతూ, “వినాయక చవితి మన దేశంలో ఎంతో పవిత్రమైన పండుగ. మన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల సహజమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతు సహకారం అందించవచ్చు. విద్యార్థులు ఈ సందేశాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరవేయాలి”అని అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సాయి దేవమణి మాట్లాడుతూ, “పండుగలు మన సంస్కృతికి ప్రతీకలు. అయితే పండుగలను జరుపుకునే సమయంలో పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల భక్తి భావంతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే పర్యావరణ బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని” పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల ప్రత్యేకత, వాటి వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు మరియు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.