Jangaon: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశానికి జిల్లా నుంచి ఎస్సీ విద్యార్థి ఎంపిక
Jangaon: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పారదర్శకంగా లక్కీ డ్రా.. ఎంపికైన జిల్లా ఎస్సీ విద్యార్థి.
Jangaon: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశానికి జిల్లా నుంచి ఎస్సీ విద్యార్థి ఎంపిక
జనగామ: విద్య ద్వారానే సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పులు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన 2026–27 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతాపూర్లో 1వ తరగతి ప్రవేశాల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) బాలబాలికల నుంచి మొత్తం (13) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఒక సీటుకు పలువురు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి పాటిస్తూ, లక్కీ డ్రా చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ లక్కీ డ్రా ద్వారా ఒక విద్యార్థి ఎంపిక కాగా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే అవకాశం లభించడం వారి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




