Warangal: వరంగల్లో బీఎల్వోలకు ఓటర్ల సమగ్ర సవరణ (SIR)పై కలెక్టర్ దిశానిర్దేశం
Warangal: భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో వరంగల్ జిల్లాలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం. ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం.
Warangal: వరంగల్లో బీఎల్వోలకు ఓటర్ల సమగ్ర సవరణ (SIR)పై కలెక్టర్ దిశానిర్దేశం
వరంగల్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వోలు) సూచించారు. ఆదివారం మూడు నియోజక వర్గాల బి ఎల్ ఓ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో వర్ధన్నపేట నియోజక వర్గం, వరంగల్ ఐ ఎం ఇ హాలులో తూర్పు నియోజక వర్గం, నర్సంపేట బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని అధికారులకు, బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ ఎన్యుమరేషన్ ఫారమ్స్
ఇంటింటికి పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న ఫారాలను త్వరగా పంపిణీ చేయాలని,పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి సంబంధిత ఓటర్ కు రెండు ఫారంలు అందిస్తారని, అందించిన ఫారంలలో ఓటరు వివరాల నమోదుకు చేసే క్రమంలో కాలనీలోనీ విద్యావంతులు, యువతి యువకులు,రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు వివిధ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ లు ఎన్యుమరేషన్ ఫారమ్స్ నింపడంలో సహకరించినట్లయితే ఓటర్ జాబితా ఆన్లైన్ చేయడం సులభతరంగా పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఓటరు వివరాలు పూరించిన రెండు ఫారాలలో ఒక ఫారం ను బి ఎల్ ఓ లకు అందించినట్లయితే అట్టి వివరాలను యాప్ లో ఎంటర్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే నిర్వహించే సమయంలో ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని అన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించి, అవసరమైన ధ్రువీకరణ అనంతరం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేయాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, అవసరమైన పత్రాల ధ్రువీకరణ, ఆన్లైన్ నమోదు విధానం, ఫీల్డ్ స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు వివరించారు. బీఎల్వోలు సందేహాలను నివృత్తి చేస్తూ, ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, వరంగల్ ఆర్డీవో సుమ , నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వివిధ మండలాల తహసీల్దార్లు ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.




