Warangal: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
Warangal: వరంగల్లో కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్పై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణానికి పాల్పడ్డారు.
Warangal: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
Warangal: కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుప మహేష్ పై గుర్తుతెలియని దుండగులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ నుంచి ఎన్టీఆర్ నగర్లోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు మహేష్పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆయన ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అనంతరం హుటాహుటిన మహేష్ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాధితుడు అడుప మహేష్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుడికి అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను కోరిన ఎమ్మెల్యే, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ... “కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుప మహేష్పై జరిగిన ఈ దాడి అత్యంత దుర్మార్గమైనది, చట్టవిరుద్ధమైనది. ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు” అని అన్నారు.అలాగే ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పోలీసు అధికారులను కోరారు.




