Hanamkonda: రాజ్యాంగ పదవులను కించపరిస్తే సహించబోం: పరకాల కాంగ్రెస్ హెచ్చరిక!
Hanamkonda: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను పరకాల కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఖండించింది.
Hanamkonda: రాజ్యాంగ పదవులను కించపరిస్తే సహించబోం: పరకాల కాంగ్రెస్ హెచ్చరిక!
హనుమకొండ జిల్లా: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు చేసిన అనుచిత ప్రవర్తన తీరు పట్ల ఉమ్మడి పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి తీవ్రంగా ఖండించారు.
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న ఒక నాయకుడిని ఉద్దేశించి ఇలాంటి అహంకారపూరితమైన, బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడటం తాతా మధుసూదన్ రావు అపరిపక్వతకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన స్పీకర్ స్థానానికి ఒక గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని మంటగలిపేలా వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు.
దళిత వర్గానికి చెందిన నాయకుడు ఉన్నత స్థానంలో ఉండటాన్ని ఓర్వలేకనే ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు విచక్షణ కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై నోరు పారేసుకుంటే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
తాతా మధుసూదన్ రావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బొమ్మకంటి చంద్రమౌళి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులపై గానీ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై గానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే ప్రజల పక్షాన తగిన బుద్ధి చెబుతామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.




