Hanamkonda: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయండి!

Hanamkonda: హనుమకొండ జిల్లాలో ఓటరు జాబితా సవరణ (SIR) డిజిటలైజేషన్‌పై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష.

Narender, Staff Reporter  -Warangal
Published on: 11 July 2026 12:32 PM IST
Hanamkonda
X

Hanamkonda: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయండి!

Hanamkonda: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రవితో కలిసి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.

డిజిటలైజేషన్ పురోగతి ఆశించిన స్థాయిలో లేని పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు.

కేటాయించిన ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ బీఎల్‌ఓలకు ప్రత్యక్షంగా సహకరించాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి దరఖాస్తును సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం, అలసత్వానికి ఎలాంటి అవకాశం ఉండదని, లక్ష్య సాధనలో ప్రతి అధికారి, ఉద్యోగి పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా వెనుకబాటు కనిపిస్తే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను పూర్తి చేయడమే లక్ష్యంగా సమష్టిగాసి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story