Hanumakonda: సాగునీటి వనరులు, వరద నివారణ పనులపై కలెక్టర్ సమీక్ష
Hanumakonda: హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సాగునీటి వనరులు, వరద నివారణ పనులపై సమీక్షించారు. పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Hanumakonda: సాగునీటి వనరులు, వరద నివారణ పనులపై కలెక్టర్ సమీక్ష
హనుమకొండ: జిల్లాలో సాగునీటి వనరుల నిర్వహణ, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వరద నివారణ చర్యలపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సాగునీటి పారుదల శాఖ అధికారులతో మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో జిల్లాలోని జె.చొక్కా రావు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన నీటి మట్టం, ప్రస్తుత నీటి లభ్యత, ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత, ప్రాజెక్ట్ నిర్వహణ, చలివాగు రిజర్వాయర్ లో నీటి లభ్యత పరిస్థితులను సాగునీటి పారుదల శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు.
ప్రాజెక్టు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి లభ్యతకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఇరిగేషన్ విభాగానికి సంబంధించిన కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఆయా పనులకు సంబంధించి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, ఇప్పటివరకు చేపట్టిన పనులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలు, పనుల పురోగతికి సంబంధించిన ఫాలోఅప్ చర్యలపై అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులను పూర్తి చేసేలా సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.
భద్రకాళి ట్యాంక్ పరిసరాల్లో వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు చేపడుతున్న పనుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ రామ్ ప్రసాద్, ఈఈలు కిరణ్ కుమార్, సునీత, ప్రశాంతి, మంగీ లాల్, జిల్లా సాగునీతిపారుదల శాఖ అధికారి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.




