Hanumakonda: నేపాల్ విపత్తుపై కేంద్ర విదేశాంగ మంత్రికి ఎంపీ కడియం కావ్య లేఖ

Hanumakonda: నేపాల్‌లో విపత్తు కారణంగా గాయపడిన, గల్లంతైన తెలంగాణ బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరుతూ వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విదేశాంగ మంత్రికి లేఖ రాశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 7:41 PM IST
Hanumakonda
X

Hanumakonda: నేపాల్ విపత్తుపై కేంద్ర విదేశాంగ మంత్రికి ఎంపీ కడియం కావ్య లేఖ

హనుమకొండ: నేపాల్‌లో తెలంగాణ రాష్ట్ర బాధితుల పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకొని సహా ఏర్పాట్లపై సమీక్షిస్తున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు

నేపాల్‌లో సంభవించిన విపత్తు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రనికి చెందిన పలువురు గాయపడటం, కొందరు మృతి చెందడం, మరికొందరు గల్లంతైన నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్‌ గారికి లేఖ పంపించారు. బాధితుల పరిస్థితి, వారి కుటుంబాల ఆందోళనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం, సంబంధిత కాన్సులర్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం, అవసరమైన చికిత్స, ఆసుపత్రి సదుపాయాలు, మందులు తదితర అత్యవసర సహాయాన్ని అందించాలని ఎంపీ డా. కడియం కావ్య కోరారు.

అలాగే విపత్తులో మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించి, అవసరమైన అధికారిక ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, భద్రంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చే వరకు బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాలని కోరారు.

గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగించాలి

ఇప్పటికీ ఆచూకీ తెలియని తెలంగాణకు చెందిన వారి కోసం నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శోధన, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. భారత రాయబార కార్యాలయం, నేపాల్ స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు, సంబంధిత ఏజెన్సీలు గల్లంతైన వారి కుటుంబాలతో నిరంతరం సమన్వయం చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

భారత రాయబార కార్యాలయ అధికారులతోనూ ఫోన్‌లో మాట్లాడిన వరంగల్ ఎంపీ డా.కడియం

కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్‌ గారికి లేఖ పంపిన అనంతరం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారులతోనూ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితుల వివరాలు, సహాయక చర్యలు, గల్లంతైన వారి ఆచూకీ, మృతదేహాల గుర్తింపు, స్వదేశానికి తరలింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నందున వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, ప్రతి ఒక్కరి ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

“ప్రతి బాధితుడికి అండగా నిలవాలి”

నేపాల్‌లో చిక్కుకున్న లేదా విపత్తు ప్రభావానికి గురైన తెలంగాణ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. గాయపడిన వారికి వైద్యం, మృతుల మృతదేహాలను స్వదేశానికి తరలించడం, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఎంపీ డా.కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story