Jangaon: మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్!

Jangaon: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం. ప్రారంభించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. ఐపీఎస్ అవార్డు గ్రహీత డీసీపీకి సన్మానం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Aug 2026 5:51 PM IST
Jangaon
X

Jangaon: మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్!

Jangaon: ప్రపంచ మానవాళికి మార్గదర్శకులైన మహ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TSMESA) జనగామ జిల్లా శాఖ, హమ్ సాత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జనగామ DCP శ్రీ రాజమహేంద్ర నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా DCP శ్రీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మైనారిటీ ఉద్యోగులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధించిన మానవత, ప్రేమ, దయ, సేవా భావం, సోదరభావం వంటి గొప్ప విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలని సూచించారు.

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

TSMESA జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్త గారి జీవితం యావత్ సమాజానికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రవక్త గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, మానవతా సేవకు రక్తదానం గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

TPTF జనగామ జిల్లా అధ్యక్షుడు N.N. రాజు మాట్లాడుతూ, మైనారిటీ ఉద్యోగులు చేపట్టిన మెగా రక్తదాన శిబిరం ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మత సామరస్యం, సోదరభావం మరియు పరస్పర సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ఇటువంటి మానవతా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

హమ్ సాత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్త చూపిన మానవతా మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి జీవనాధారం అందించవచ్చని, ఒకరి రక్తదానం మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రక్తదాన శిబిరానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనారిటీ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, మస్జిద్ కమిటీల అధ్యక్షులు, సామాజిక కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై న శ్రీ రాజమహేంద్ర నాయక్ గారికీ కేంద్ర ప్రభుత్వం IPS అవార్డ్ లభించిన సందర్భంగా వారిని శాలువా తో సన్మానం చేసి పూల బోకేతో శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్భంగా మహ్మద్ అంకుషావలి, మహ్మద్ జలీల్, మహ్మద్ యాకూబ్ పాషా, N.N. రాజు, మహ్మద్ తహసీన్, మహ్మద్ ఖలీల్, మోహసిన్, జమాల్ షరీఫ్, షకీల్, మసీ ఉర్ రెహ్మాన్, సాజిద్, సలీం, అజారుద్దీన్, నూరుద్దీన్, ఖాళీం, అజీమ్, సయ్యద్ జహంగీర్ హుస్సేన్, ఇస్మాయిల్, ఎజాజ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మానవతా సేవ, రక్తదానం, మత సామరస్యం మరియు సోదరభావానికి ప్రతీకగా నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం సమాజానికి మానవతా సందేశాన్ని చాటిచెప్పింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story