Mahabubabad: మహబూబాబాద్లో పోలీస్ దర్బార్: ఏఆర్ సిబ్బందితో ఎస్పీ శబరీష్ సమీక్ష
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఏఆర్ పోలీస్ దర్బార్లో సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Mahabubabad: మహబూబాబాద్లో పోలీస్ దర్బార్: ఏఆర్ సిబ్బందితో ఎస్పీ శబరీష్ సమీక్ష
మహబూబాబాద్ జిల్లా: పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆర్ముడ్ రిజర్వ్ (AR) సిబ్బందితో పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, ఆర్.ఐలు సోములు, భాస్కర్, అనిల్, నాగేశ్వర్రావు, ఆర్.ఎస్.ఐలు,ఏఆర్ ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీ బందోబస్తు విధులు, ఎన్నికల డ్యూటీలు, ప్రజా భద్రత విధులు, ప్రత్యేక ఆపరేషన్లు, పండుగల సమయంలో నిర్వహించే బందోబస్తు వంటి కీలక బాధ్యతలను ఏఆర్ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఇదే క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు కొనసాగించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా ప్రతి పోలీస్ సిబ్బంది నిజాయితీతో పనిచేయాలని, శాఖలో అవినీతికి ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా రాజీ ఉండదని హెచ్చరించారు.
గౌరవ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్,ఐపీఎస్ గారి మార్గదర్శకాల మేరకు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
సిబ్బంది సంక్షేమం పట్ల జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వసతి, డ్యూటీ సమయాలకు సంబంధించిన అంశాలను అధికారులకు నేరుగా తెలియజేయాలని సూచించారు. సమస్యలను పెండింగ్లో ఉంచకుండా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు. వేసవి కాలంలో విధులు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, తగినంత నీరు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ద్వారా పోలీసు శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొంటూ, శాఖ ప్రతిష్టను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సూచించారు.




