Thimmapur: తిమ్మాపూర్లో ‘ప్రజా పాలన’ సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం!
Thimmapur: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష.
Thimmapur: తిమ్మాపూర్లో ‘ప్రజా పాలన’ సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం!
తిమ్మాపూర్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిమ్మాపూర్లో ప్రభుత్వ పథకాల అమలు - ప్రగతి నివేదిక
గ్రామంలో ఇప్పటివరకు అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ప్రగతి నివేదికను మంత్రి పొన్నం ప్రభాకర్కు సమర్పించారు.
పెన్షన్లు: 289 మందికి నెలకు రూ.6.92 లక్షల మేర పెన్షన్లు అందుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లు: 14 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు.
గృహజ్యోతి: 217 కుటుంబాలకు రూ.21.11 లక్షలు విడుదలయ్యాయి.
రూ.500కే గ్యాస్ సబ్సిడీ: 272 కుటుంబాలకు రూ.5.96 లక్షలు విడుదలయ్యాయి.
ఆయిల్పామ్ సబ్సిడీ: ఇద్దరు రైతులకు రూ.93 లక్షలు విడుదలయ్యాయి.
ఇతర పథకాలు: రూ.14 లక్షలు విడుదలయ్యాయి.
మహిళా సంఘాల బ్యాంక్ లింకేజీ: రూ.65.18 లక్షలు విడుదలయ్యాయి.
రైతు భరోసా: గ్రామంలో ఇప్పటివరకు రూ.22.22 కోట్లు విడుదలయ్యాయి.
రైతు బీమా: ఒక రైతు కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి.
రైతు రుణమాఫీ: గ్రామంలో రూ.2.11 కోట్ల రుణమాఫీ పూర్తయింది.
సన్న వడ్ల బోనస్: రూ.49 లక్షలు విడుదలయ్యాయి.
నూతన రేషన్ కార్డులు: 46 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి.
భూభారతి: 13 దరఖాస్తులు క్లియర్ చేయబడ్డాయి.
కళ్యాణలక్ష్మి: 18 మందికి చెక్కులు విడుదలయ్యాయి.
గ్రామ సమస్యలపై మంత్రి హామీలు
తిమ్మాపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మించాలని, స్మశానవాటిక ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాలకు వీఓ భవనాలు నిర్మించాలని గ్రామస్థులు మంత్రిని కోరారు. పాఠశాల ప్రాంతంలో వీఓ భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోచమ్మ ఆలయానికి రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు.
నీటి సంరక్షణ, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
జలసిరి కార్యక్రమం కింద ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6,500 ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రతి పొలంలో ఫామ్ కుంటలు నిర్మించుకోవాలని రైతులకు సూచించారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. తిమ్మాపూర్ గ్రామంలో కొత్తగా 14 ఫామ్ కుంటలు మంజూరైనట్లు తెలిపారు.
అర్హులందరూ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
ఈ నెల 31వ తేదీ వరకు పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ బాధితులు, తలసేమియా బాధితులు, దివ్యాంగులు తదితర అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆయిల్పామ్, సోలార్పై అవగాహన
రైతులు ఆయిల్పామ్ సాగును పెంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆయిల్పామ్ సాగు ద్వారా దీర్ఘకాలికంగా నెలవారీ ఆదాయం వచ్చేలా రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
అలాగే పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముప్పు మానస మహేందర్, జడ్పీ సీఈవో , జిల్లా అధికారులు, వివిధ శాఖల మండల అధికారులు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




