Hanamkonda: ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్!
Hanamkonda: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Hanamkonda: ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్!
Hanamkonda: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాస చర్యలు, అటవీ అనుమతులు, భూబాధితులకు పరిహారం చెల్లింపుల పురోగతిపై నీటిపారుదల, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నీ జిల్లాల కలెక్టర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలసౌధలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా వారీగా ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో పెండింగ్లో ఉన్న భూసేకరణ, అటవీ అనుమతులు, పునరావాస చర్యలు, పరిహారం చెల్లింపులపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ వీసీ లో కలెక్టరెట్ నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ అనుమతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో... అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న భూసేకరణ, అటవీ అనుమతుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక శాఖ నుంచి కలెక్టర్ల PD ఖాతాలకు జమ అయిన నిధులు, భూబాధితులు, అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికే చెల్లించిన పరిహారం వివరాలను సమీక్షించారు.
కలెక్టర్ల PD ఖాతాల్లో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ చెల్లింపులు పెండింగ్లో ఉండటానికి గల కారణాలను గుర్తించి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి భూబాధితుడికి పరిహారం సకాలంలో అందేలా స్పష్టమైన గడువుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, అటవీ అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం పెంచి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తెలిపారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల పురోగతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ వీసీ లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి హనుమకొండ జిల్లాలో 647 ఎకరాల భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలియజేశారు. భూసేకరణకు సంబంధించిన అవార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతున్నదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జ అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, గౌరవెల్లి ప్రాజెక్టు డీఈ చైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.




