Mahabubabad: పాఠశాలలో మాక్ ఎన్నికలు.. ఓటు హక్కుపై ప్రత్యక్ష అవగాహన!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో విద్యార్థులకు మాక్ ఎన్నికలు నిర్వహించారు.
Mahabubabad: పాఠశాలలో మాక్ ఎన్నికలు.. ఓటు హక్కుపై ప్రత్యక్ష అవగాహన!
Mahabubabad: కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు మాక్ ఎన్నికలను నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల నిర్వహణ విధానం, ఓటర్ల బాధ్యతల గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మాక్ ఎన్నికల్లో విద్యార్థులు ఓటర్లుగా, పోలింగ్ సిబ్బందిగా, అభ్యర్థులుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ఉత్సాహంగా నిర్వహించారు. ఓటరు జాబితా పరిశీలన, ఓటు నమోదు, రహస్య బ్యాలెట్ విధానం, ఓట్ల లెక్కింపు వంటి అంశాలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని తెలిపారు.
చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుత పౌరసత్వ భావన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో చైతన్యవంతమైన ఓటర్లుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చిర్ర నరేష్., ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




