Mulugu: జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలి!
Mulugu: ములుగు జిల్లాలో చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Mulugu: జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలి!
Mulugu: జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు.జిల్లాలోని చిత్తడి నేలల గుర్తింపు, సర్వే, హద్దుల నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి,
వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సమగ్ర నివేదికను రాష్ట్ర చిత్తడి నేలల ప్రాధికార సంస్థకు పంపించాలని ఆదేశించారు.
జలవనరుల పరిశీలనలో నీటిపారుదల, అటవీ, రెవెన్యూ శాఖలు ప్రధాన బాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా క్షేత్రస్థాయి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రతి జలవనరును స్వయంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డి పి ఓ వెంకయ్య, డి ఏ ఓ సురేష్ కుమార్, జిల్లా ఉద్యానవ శాఖ అధికారి సంజీవరావు, డి ఆర్ డి ఓ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




