Hanumakonda: వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం
Hanumakonda: హనుమకొండ జిల్లా వీర్లగడ్డ తండాలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమం. గ్రామ సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ.
Hanumakonda: వీర్లగడ్డ తండా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి పొన్నం
Hanumakonda: భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థుల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం గ్రామ ప్రజల నుంచి గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించి, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీర్లగడ్డ తండా ప్రగతి నివేదిక
ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.
గ్రామంలో 211 రేషన్ కార్డులు పంపిణీ చేయగా, లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు.
37 మందికి పెన్షన్లు అందుతున్నాయి.
8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 6 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 2 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
48 భూభారతి దరఖాస్తులు రాగా, 42 దరఖాస్తులు పరిష్కరించారు.
141 కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది.
66 కుటుంబాలకు మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కింద రూ.37,211 విడుదల చేశారు.
13 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు వడ్డీలేని రుణాల కింద రూ.3.75 లక్షలు విడుదల చేశారు.
రైతు బీమా కింద ఇద్దరు రైతులకు రూ.10 లక్షలు అందించారు.
239 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద రూ.2.26 కోట్లు మాఫీ చేశారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 62 మంది లబ్ధిదారులకు 62 చెక్కులు అందించారు.
అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
మూతపడిన పాఠశాల పునఃప్రారంభం
గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని గ్రామస్థులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులను చేర్పించేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామంలోని అంతర్గత రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్టు పిల్ల కాలువలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలపై కూడా గ్రామస్థులు వినతిపత్రాలు అందజేశారు. వీటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
“పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గ్రామాల్లో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా కలిసి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్య ఉంటుందని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ సూచనలు, విజ్ఞాపనలు అందిస్తుంటారని తెలిపారు. గ్రామ సమస్యలను అధికారుల సమక్షంలోనే తెలుసుకుని, వాటిని జాబితా రూపంలో నమోదు చేసి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయో తెలుసుకోవడంతో పాటు, గ్రామానికి ఇంకా అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రజల సూచనలు తీసుకుని గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
వర్షపు నీటిని సంరక్షించుకోవాలి
ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి చుక్క వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం, పంటల దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు.
రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. భూమిలో కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలు, ముఖ్యంగా ఆయిల్పామ్ సాగు చేపట్టడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన ఆదాయం పొందవచ్చని చెప్పారు.
ఆయిల్పామ్ సాగు చేస్తున్న లావుడ్య మంగ్యను మంత్రి అభినందించారు. రైతులకు ఆయిల్పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకునే వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, హెచ్ఐవీ, బోదకాలు తదితర అర్హతలు కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వారికి కూడా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ, ఆరోగ్య సేవలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణ, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని మంత్రి తెలిపారు.
ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో 22 ఓట్లు “అనమైల్” కింద ఉన్నట్లు గుర్తించామని అధికారులు మంత్రికి తెలిపారు. సంబంధిత ఓటర్లు తమ వివరాలను సరిచేసుకునేలా అవగాహన కల్పించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జల సిరి తో నీటి భద్రత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి పంటకు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.
వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాలను పెంచడం, గ్రామాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్లో తాగునీరు, సాగునీటి సమస్యలను తగ్గించేందుకు జలశ్రీ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
పీఎం సూర్య ఘర్తో విద్యుత్ పొదుపు
గ్రామస్థులు పీఎం సూర్య ఘర్ పథకాన్ని వినియోగించుకుని తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అవసరమైన విద్యుత్ను వినియోగించుకుని, అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ పథకంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలు, అవసరాలు, సూచనలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూగులోతు పూర్ణిమ- రాజు, జిల్లా అధికారులు, మండల అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




