Warangal: పార్లమెంట్లో వరంగల్ ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై ఎంపీ కావ్య ప్రశ్న
Warangal: వరంగల్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన ఎంపీ డా. కడియం కావ్య. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ సమాధానం.
Warangal: పార్లమెంట్లో వరంగల్ ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై ఎంపీ కావ్య ప్రశ్న
వరంగల్: వరంగల్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్ లో ప్రశ్నించారు. జిల్లాలో కేంద్ర పథకాల అమలు, వాటి ఫలితాలపై కేంద్ర ప్రభుత్వంన్ని వివరాలు కోరారు.
ఈ మేరకు వరంగల్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడేళ్లలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎమ్ఈ) పథకం కింద వరంగల్ జిల్లాలో 147 ప్రాజెక్టులు మంజూరయ్యాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం 171 యూనిట్లు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటి ద్వారా రూ.18.91 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. రూ.4.15 కోట్ల సబ్సిడీ మంజూరై 549 మందికి ఉపాధి లభించినట్లు తెలిపింది.
ఈ అంశంపై స్పందించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న వరంగల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగ విస్తరణ రైతులు, యువతకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. పంట అనంతర నష్టాల నివారణ, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ, గ్రామీణ ఉపాధి పెంపు లక్ష్యాలతో కేంద్ర పథకాలను మరింత సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వరంగల్ జిల్లాలో మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాలు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు. వరంగల్ రైతాంగానికి మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.




