Warangal: పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ర్యాలీ.. మోదీ దిష్టిబొమ్మ దహనం!
Warangal: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ఆందోళన చేపట్టారు.
Warangal: పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ర్యాలీ.. మోదీ దిష్టిబొమ్మ దహనం!
Warangal: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ డీసీసీ భవన్ నుంచి అశోక జంక్షన్ వరకు మోదీ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తైన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు సామాన్య ప్రజల జేబులు ఖాళీ చేస్తోందని ఆరోపించారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావం అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై పడుతూ మధ్యతరగతి, పేద ప్రజల జీవనాన్ని మరింత భారంగా మారుస్తోందని పేర్కొన్నారు. రైతు నుంచి ఆటో డ్రైవర్ వరకు ప్రతి వర్గం ఈ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.
“అచ్చే దిన్” పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలకు “భారాల దిన్” చూపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని, పెంచిన ఇంధన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




