Eluru: పడవ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. వేలేరుపాడు రేవులో అక్రమాల దందా!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పడవ రేవులో జరుగుతున్న అక్రమాలపై దళిత సంఘం నాయకులు కొక్కెరపాటి రవీంద్ర అధికారులకు ఫిర్యాదు చేశారు.
Eluru: పడవ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. వేలేరుపాడు రేవులో అక్రమాల దందా!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం పరిధిలోని రుద్రంకోట, కూనవరం గ్రామపంచాయతీల మధ్య నిత్యం వందలాది మంది ప్రయాణికులు పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ పడవ రేవుకు గత మూడు నెలల క్రితం ప్రభుత్వాధికారులు పెర్రి పాట నిర్వహించారు. ప్రభుత్వాధికారులు ద్వారా పెర్రి పాట నిర్వహించగా గుత్తేదారు రూ.89 లక్షల 30వేలకు రేవు పాటను దక్కించుకున్నారు.
రేవు పాట పాడిన మరుసటి రోజు నుంచి లాంచీలు నడపవలసి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని చేపల వేటకు వెళ్లి బోట్లను తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గురువారం స్థానిక తహశీల్దార్, ఎంపిడిఒలకు దళిత సంఘం నాయకులు కొక్కెరపాటి రవీంద్ర ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కొక్కెరపాటి రవీంద్ర మాట్లాడుతూ ఏప్రిల్ నెల పదో తారీఖున నిర్వహించిన వేలం పాటలో అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని పడవలను తిప్పిన తక్షణమే పడవ పాట రద్దు చేస్తామని, గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.
కానీ నేటికీ కూడా పడవ పాట నిర్వహించిన రోజు నుండి ఈ రోజు వరకు గుత్తేదారు ప్రయాణికుల వద్ద నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, కనీసం పడవ నడిపే డ్రైవర్లకు కనీస అర్హత పత్రాలు ఎటువంటివి లేకుండా పడవ పాట బినామీ దారుడు నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నా, అధికారులు నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నామని, లేనిపక్షంలో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని తెలియజేశారు. అనంతరం ఎంపిడిఒ శ్రీహరి, డిప్యూటీ తహశీల్దార్ సురేష్ కు రేవు పాట పాడిన గుత్తేదారుపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.




