Bhimavaram: ఆక్వా రంగంపై కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం – కవురు

Bhimavaram: ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ఫీడ్ సిండికేట్ కంపెనీలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 4 Sept 2026 11:03 PM IST
Bhimavaram
X

Bhimavaram: ఆక్వా రంగంపై కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం – కవురు

​భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, విధానపరమైన నిర్లక్ష్యంతో రైతులు నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కవర్ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

​గత రెండు నెలలుగా ఆక్వా ఫీడ్ ధరలను విపరీతంగా పెంచుతున్నారని, తాజాగా కేజీపై సుమారు ₹9 వరకు ధర పెంచడంతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడిందని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ ధరల పెంపునకు వ్యతిరేకంగా రైతులు పంటను రోడ్లపై పోసి, ఫీడ్ బస్తాలను తగులబెట్టి నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు.

​ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై వినూత్న రీతిలో విమర్శలు చేశారు:

​కొత్త రోగం 'CBN': గతంలో ఆక్వా సాగులో వైట్ స్పాట్, వైట్ గట్, EHP వంటి వ్యాధులతో రైతులు నష్టపోతే, ప్రస్తుతం 'CBN' (చంద్రబాబు సిండికేట్ సిండ్రోమ్) అనే కొత్త సమస్య వ్యాపించిందని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రంగాన్ని, రైతు ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకొచ్చిన 'ఆప్సడా చట్టం' నిబంధనలను సీఎం చంద్రబాబు, మంత్రులు పూర్తిగా పక్కనపెట్టి ఫీడ్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

​ఆప్సడా చట్టంలోని నిబంధనలను ఉటంకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించగా, ఫీడ్ ధరల పెంపుపై న్యాయస్థానం స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. APలో వచ్చిన ఈ తీర్పు ఆధారంగా తమిళనాడు, ఒడిశా, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల రైతులు కూడా వివరాలు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు.

​పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించేవరకు, ఆక్వా రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్సీపీ తరపున పోరాటం కొనసాగిస్తామని, రైతులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story