Unguturu: ఉంగుటూరు రైతులకు గుడ్ న్యూస్ తొలి విడతగా రూ.10.85 కోట్లు జమ!

Unguturu: ఉంగుటూరు నియోజకవర్గంలో "అన్నదాత సుఖీభవ" పథకాన్ని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వితో కలిసి శనివారం ఘనంగా ప్రారంభించారు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 20 Jun 2026 7:13 PM IST
Unguturu
X

Unguturu: ఉంగుటూరు రైతులకు గుడ్ న్యూస్ తొలి విడతగా రూ.10.85 కోట్లు జమ!

ఉంగుటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగాభివృద్ధికి NDA కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన “అన్నదాత సుఖీభవ” పథకాన్ని శనివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి గారితో కలిసి నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల మేలు కోసం వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిందని చెప్పారు.

ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు జోడించి మొత్తం రూ.20 వేలును ఏడాదికి మూడు విడతల్లో రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. తొలి విడతగా నేడు రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ అవుతున్నాయని, గత ప్రభుత్వంతో పోలిస్తే రైతులకు ఏడాదికి అదనంగా రూ.6,500 లబ్ధి చేకూరుతుందని వివరించారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 18,794 మంది అర్హత కలిగిన రైతులకు తొలి విడత కింద రూ.10 కోట్ల 85 లక్షలు జమ చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే ధర్మరాజు గారు తెలిపారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని, వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.

అనంతరం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను, సబ్సిడీపై రైతులకు అందిస్తున్న వ్యవసాయ పరికరాల ప్రదర్శనను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు పరిశీలించారు. అలాగే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పామాయిల్, కోకో సాగుపై అవగాహన సదస్సు స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ గారితో కలిసి సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీమతి శరణాల మాలతీ రాణి గారు, ఉంగుటూరు AMC ఛైర్మన్ గారు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మండల, గ్రామాల అధ్యక్షులు, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story