Bhimavaram: దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్ వద్ద ఖాళీ శవపేటికలతో నిరసన!
Bhimavaram: దళితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ఖాళీ శవపేటికలతో నిరసన చేపట్టనున్నారు.
Bhimavaram: దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్ వద్ద ఖాళీ శవపేటికలతో నిరసన!
భీమవరం: రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళిత వాడల్లోని సమస్యలు, దళితుల కష్టాలు ఏమాత్రం తీరడం లేదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS), ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కుల వివక్ష రూపం మారి ఇంకా కొనసాగుతోందని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె. క్రాంతి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. దళితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు మరణిస్తే కనీసం ఆరడుగుల గొయ్యి తీసి పూడ్చడానికి కూడా జిల్లాలో అనేక ప్రాంతాల్లో సరైన స్థలాలు లేకపోవడం దారుణమని అన్నారు.
దళితుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ వల్ల వారికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, దళిత గృహాలకు కరెంట్ వెలుగులు దక్కకుండా, అధికారులు ఆ విద్యుత్ను అమ్ముకుంటున్నారని నాయకులు ఆరోపించారు.
దళితుల పట్ల ప్రభుత్వం మరియు యంత్రాంగం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి, ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేందుకు ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద "ఖాళీ శవపేటికలతో వినూత్న నిరసన" కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నాయకులు ప్రకటించారు. దళిత, వ్యవసాయ కార్మిక వర్గాలు మరియు ప్రజాస్వామ్యవాదులు ఈ ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.




