Maredumilli: వర్షాన్ని లెక్కచేయకుండా విద్యుత్ పునరుద్ధరణ
Maredumilli: మారేడుమిల్లి మండలం గుడిసె గ్రామంలో భారీ వర్షాలు, పొగమంచును లెక్కచేయకుండా ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ పునరుద్ధరించిన సిబ్బంది.
Maredumilli: వర్షాన్ని లెక్కచేయకుండా విద్యుత్ పునరుద్ధరణ
మారేడుమిల్లి: రంపచోడవరం డివిజన్ పరిధిలో గల మారేడుమిల్లి మండలం గుడిసె గ్రామంలో సెల్ టవర్ కి సంబందించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడయింది కురుస్తున్న వర్షాలు, దట్టంగా అలుముకున్న పొగమంచు.. మరోపక్క రహదారులు సహకరించని క్లిష్ట పరిస్థితి. అయినా సరే, ప్రజలకు విద్యుత్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఏకైక లక్ష్యంతో విద్యుత్ శాఖ సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు.
ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ, ఓ ప్రాంతంలో పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసేందుకు ఉద్యోగులు వీరోచితంగా శ్రమించారు. సహకరించని రోడ్లను, దట్టమైన పొగమంచు, వర్షంలోనూ రైన్ కోట్లు ధరించి, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రాణాలకు తెగించి విధుల్లో పాల్గొన్నారు. వర్షం నీటిలో తడుస్తూనే హెవీ ట్రాన్స్ఫార్మర్ను సురక్షితంగా అమర్చి విద్యుత్ పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రకృతి విపత్తుల సమయంలో తమ స్వార్థాన్ని మరిచి, రాత్రింబవళ్ళు కష్టపడుతూ వెలుగులు నింపుతున్న విద్యుత్ ఉద్యోగుల అంకితభావాన్ని, శ్రమను స్థానిక ప్రజలతో పాటు అధికారులు కూడా ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. దీనిలో విద్యుత్ సిబ్బంది ప్రసన్న కుమార్, లైన్ మెన్ బాపన్న దొర. వీరాస్వామి. బాలరాజు. కన్నపు రెడ్డి. సిద్ధార్థ రెడ్డి. యన్. వి.రెడ్డి పాల్గొన్నారు.




