Penumantra: పెనుమంట్రలో ‘వీబీ-గ్రామ్-జీ’ పథకం ప్రారంభం ఎమ్మెల్యే పితాని
Penumantra: పెనుమంట్రలో వీబీ-గ్రామ్-జీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. ఉపాధి శ్రామికులకు ఏడాదికి 125 రోజుల పని దినాల హామీ.
Penumantra: పెనుమంట్రలో ‘వీబీ-గ్రామ్-జీ’ పథకం ప్రారంభం ఎమ్మెల్యే పితాని
పెనుమంట్ర: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ఉపాధి కల్పన, జీవనోపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ–గ్రామ్–జీ (వికసిత్ భారత్–గ్రామీణ ఉపాధి, జీవనోపాధి మిషన్)' పథకాన్ని ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గురువారం పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర, వెలగలవారిపాలెం గ్రామాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించే ఈ పథకం గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అన్నారు. నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి అవకాశాల పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మండల, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




