Unguturu: ఉంగుటూరు భీమడోలులో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం
Unguturu: ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు లంక గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చేతుల మీదుగా చెట్టున్నపాడు-ఏలూరు నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం.
Unguturu: ఉంగుటూరు భీమడోలులో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం
ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలోని లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, శ్రామికులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇటీవల గ్రామ ప్రజలు, కూటమి నాయకులు ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారితో మాట్లాడి చెట్టున్నపాడు నుండి ఏలూరు వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు మంజూరు చేయించారు.
ఈ మేరకు శుక్రవారం ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు స్థానిక కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి జెండా ఊపి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యను వెంటనే పరిష్కరించి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే ధర్మరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు మాట్లాడుతూ, ఈ బస్సు సౌకర్యంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, శ్రామికుల రోజువారీ ప్రయాణం సులభతరం అవుతుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండల టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామస్థులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




